Hyderabad, August 24 (TNA) 2025 అహ్మదాబాద్ సైబర్ ఉగ్రవాదం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేస్తోంది. 2025 మార్చి, మే నెలల మధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కీలక మౌలిక సదుపాయాల వెబ్సైట్లపై డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్వీస్ (DDoS) దాడులు చేసినందుకు గాను ఈ కేసు నమోదైంది. కేసులో ప్రధాన నిందితుడైన జాసిమ్ షానవాజ్ అన్సారీతోపాటు ఒక మైనర్ ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోని పెద్దపల్లి సహా నిందితులకు సంబంధం ఉన్న పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
2025 అహ్మదాబాద్ సైబర్ ఉగ్రవాదం కేసులో దర్యాప్తు ముమ్మరం
ఇప్పటికే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అన్సారీపై ఛార్జ్ షీట్ దాఖలైంది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా సైబర్ దాడులకు పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది. వీపీఎన్, ఎన్ క్రిప్టెడ్ ప్లాట్ ఫారమ్ లతో పాటు, అధునాతన హ్యాకింగ్ టూల్స్ తో దాడులు చేశారు. వీటితోపాటు టెలిగ్రామ్ ఛానెళ్లలో నిందితులు దేశ ద్రోహ కంటెంట్ షేర్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సోదాల్లో లభ్యమయ్యే, డిజిటల్ పరికరాలు, సాక్ష్యాల ఆధారంగా ఎన్ఐఏ తదుపరి విచారణను కొనసాగించనుంది.